విజయవాడ వాసుల మెట్రో కల చివరికి సాకారం కానుంది. రాష్ట్ర విభజన అనంతరం పదేళ్లుగా ఊరిస్తున్న మెట్రో ప్రాజెక్ట్పై ఎట్టకేలకు ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకుంది. మెట్రో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారిక సమాచారం అందింది. ఈ ప్రాజెక్ట్ కోసం విజయవాడతో పాటు శివార్లలో ఎక్కడెక్కడ భూమి అవసరమో గుర్తించేందుకు అధికారులు వేగంగా సర్వే నిర్వహిస్తున్నారు.
మెట్రో రూట్ వివరాలు
కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద మెట్రో కోచ్ డిపో ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి మొదలై విజయవాడ పీఎన్బీఎస్ వరకూ 26 కిలోమీటర్ల మెట్రో కారిడార్ రూపొందనుంది. ఈ మార్గంలో గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరస్తా, గుణదల, మాచవరం, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ లాంటి ప్రధాన ప్రాంతాలు ఉంటాయి.
ఇక, రెండో కారిడార్ పీఎన్బీఎస్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. ఇది బెంజ్ సర్కిల్, ఆటోనగర్, ఇందిరాగాంధీ స్టేడియం వంటి రద్దీ ప్రాంతాలను కలుపుతుంది.
భూసేకరణ ప్రక్రియ
మెట్రో ప్రాజెక్ట్ తొలి దశలో 34 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 91 ఎకరాల భూసేకరణ అవసరం. విజయవాడ నగర పరిధిలో 30 ఎకరాలు, మిగతా భూభాగం కృష్ణా జిల్లా పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో 8, 9, 10, 11, 16 రెవెన్యూ వార్డుల్లో భూసేకరణ చేపట్టనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో భూసేకరణ సులభంగా సాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. గన్నవరం, పెనమలూరు వరకు మెట్రో విస్తరించనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. మొత్తం 38.40 కిలోమీటర్ల పొడవుతో మెట్రో లైన్ వేయనున్నారు.
మెట్రో కల సాకారం కానుందా?
విజయవాడ మెట్రో రైల్ పనులు ఇప్పటి వరకు అనేక సార్లు వాయిదా పడ్డాయి. కానీ తాజా భూసేకరణ ప్రక్రియతో మెట్రో నిర్మాణం మరింత దిశగా ముందుకు సాగనుందని భావిస్తున్నారు. మెట్రో ప్రాజెక్ట్ పూర్తి అయితే, నగర ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని, ప్రజలకు అధునాతన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

2 thoughts on “విజయవాడ మెట్రో: భూసేకరణకు గ్రీన్ సిగ్నల్.. మెట్రో కల సాకారానికి తొలి అడుగు!”
Comments are closed.