కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్, క్రిశాంక్లపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని తీసుకోవద్దని, అక్కడ ఉన్న చెట్లను నరకవద్దని విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. విద్యార్థుల నిరసనను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంలో, పోలీసులు డిలీప్ మరియు క్రిశాంక్ పై యూనివర్సిటీ ఆందోళనలతో సంబంధించి వీడియోలను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తూ, అశాంతిని సృష్టించి ప్రజలను రెచ్చగొట్టడంపై 353 1(b), 353 1(c), 353(2), 192, 196(1), 61(1)(a) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా నిందితులు యూనివర్సిటీ అధికారులను సంప్రదించకుండా వీడియోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేసినట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించేలా వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Read More : HCU : విద్యార్థుల నిరసన, పోలీసుల లాఠీచార్జ్పై తీవ్ర విమర్శలు
