తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానాలపై స్పష్టత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడంపై ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపు

పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి ఒకేసారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లకు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించామన్నారు. డీసీసీ అధ్యక్షులందరికీ కూడా పదవులు ఇచ్చినట్లు వివరించారు.

గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు

గాంధీ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తనకు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం అంతకు మించి అని.. దాన్ని ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

కేంద్ర కేబినెట్‌లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడులో మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తుచేశారు. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తిచేస్తామన్నారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందని, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

భారత్ సమ్మిట్ నిర్వహణ

తెలంగాణలో ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు భారత్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 60 దేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి అవసరమని పేర్కొన్నారు.

డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు

డీలిమిటేషన్ విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆ కమిటీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి, ఆ తర్వాత డీఎంకే మీటింగ్‌లో తమ వైఖరిని వెల్లడించనున్నట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్‌పై విమర్శలు

పంటలు ఎండిపోయినా, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా బీఆర్‌ఎస్ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా ఆనందం పొందడం తగదని ఆయన మండిపడ్డారు.

Read More