బీసీ రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా బీజేపీ – పీసీసీ చీఫ్

ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చర్చించామన్నారు. అలాగే తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయ బద్దంగా చేసిన తీరుపై పార్టీ అగ్ర నేతలకు వివరించామని, రెండు గంటలపాటు సమావేశం జరిగిందన్నారు.

మేం ఇచ్చిన సమాచారాన్ని రాహుల్ గాంధీ, ఖర్గే విన్నారని, కేంద్రంలో పెండింగ్ లో ఉన్న బిల్లులపై వారికి వివరించామన్నారు. గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన బిల్లులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీని కోసం రాష్ట్రం పంపిన బిల్లుల ఆమోదానికి కేంద్రంతో పోరాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇంకా సుప్రీం కోర్టు రిజర్వేషన్ల క్యాప్ ను తొలగించేందుకు కేంద్రం పై ఒత్తిడి తెచ్చేలా పార్లమెంట్ లో పోరాడాలని కోరినట్లు తెలిపారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది చేసింది.. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని తెలిపారు.

మరోవైపు, బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందన్నారు. శాసనసభలో బీజేపీ ఓటు వేసింది.. కానీ, కేంద్రం వద్దకు వచ్చే సరికి బీజేపీ యూటర్న్ తీసుకుందని తెలిపారు. దీనిపై 9వ షెడ్యూల్ లో చర్చ జరిపేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. అంతేకాకుండా తాము ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీల నేతలతో మాట్లాడుతామని చెప్పుకొచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇందిరా భవన్ లో కాంగ్రెస్ ఎంపీలకు కుల గణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని.. ఒకవేళ కేంద్రం ఆమోదం తెలపకుంటే.. రాహుల్ నేతృత్వంలో ఉద్యమం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

One thought on “బీసీ రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా బీజేపీ – పీసీసీ చీఫ్

Comments are closed.