జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు – త్వరలో నామినేషన్

Nagababu

జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు (Nagababu) పేరు ఖరారైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన సోదరుడిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లు సమాచారం. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

నాగబాబు ఎంపికపై కీలక నిర్ణయం

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేనకు కేటాయించిన ఒక స్థానానికి అభ్యర్థిగా నాగబాబు ఎంపిక కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)తో పవన్ కల్యాణ్ భేటీ అయిన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో చంద్రబాబు, నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఎంపిక మరింత ప్రాముఖ్యత కలిగింది.

టీడీపీ-బీజేపీ ఎమ్మెల్సీ స్థానాల పంపిణీపై ఉత్కంఠ

నాగబాబు అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో మిగతా నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నాలుగు స్థానాలు పూర్తిగా టీడీపీకి దక్కుతాయా? లేదా బీజేపీకి కూడా ఒక స్థానం కేటాయిస్తారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని వారితో పాటు, పార్టీకి కీలకంగా పనిచేసిన పలువురికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ పదవిపై ఆసక్తి పెరిగింది.

ఢిల్లీ టూర్ అనంతరం చంద్రబాబు కీలక నిర్ణయం?

ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్నారు. ఆయన బీజేపీ అధిష్ఠానంతో జరిపే చర్చల అనంతరం ఎమ్మెల్సీ స్థానాల పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు తిరిగి వచ్చాక కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

Read More

One thought on “జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు – త్వరలో నామినేషన్

Comments are closed.