తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్ టాపిక్గా మారాయి. ఐదు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 సీటు దక్కుతుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. రెండో అభ్యర్థిని బరిలోకి దింపే ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా బీఆర్ఎస్కు లాభం ఏంటి? కాంగ్రెస్కు నష్టం ఏంటి? అన్నదే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
రెండో అభ్యర్థితో కొత్త రాజకీయం
బీఆర్ఎస్కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు ఖాయంగా వస్తుంది. అయితే, రెండో అభ్యర్థిని నిలబెట్టాలంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన అసంతృప్త ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకున్నప్పటికీ, కంటోన్మెంట్ బైఎలక్షన్లో ఓటమి చెందింది. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఈ లెక్కన, ఒక్కో ఎమ్మెల్సీ గెలిపించుకోవాలంటే 19 ఓట్లు అవసరం. ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవాలంటే 38 ఓట్లు కావాలి.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దృష్టి
ఈ ఎన్నికలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేయాలని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ తాను కాంగ్రెస్లో లేనని ప్రకటించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలూ ఇదే బాటలో ఉన్నారని సమాచారం. వీరంతా తమకు మద్దతుగా నిలుస్తారని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో, రెండో అభ్యర్థిని నిలబెట్టి సీఎం రేవంత్ రెడ్డిని ఒత్తిడిలో పెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్కు ముసలం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని ప్రకటిస్తే, అది కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశముంది. మైలేజ్ పెంచుకోవడమే కాకుండా, అసంతృప్త ఎమ్మెల్యేలను బయటపెట్టే అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, కేసీఆర్ వ్యూహంతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారినట్టుగా కనిపిస్తోంది.

One thought on “కేసీఆర్ మాస్టర్ ప్లాన్: కాంగ్రెస్పై టార్గెట్గా ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం!”
Comments are closed.