బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేలా టీడీపీలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విధానాన్ని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడును ఎంపిక చేసిన చంద్రబాబు నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యత
టీడీపీ వెన్నెముక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైందని దేవినేని ఉమా అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అభ్యర్థులు పెద్దల సభలో ప్రజా సమస్యలపై పోరాడాలని ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ విధానాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు
“ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారు. విద్యావంతులకు, యువతకు సముచిత అవకాశాలు కల్పిస్తున్నారు. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి అమలు చేసిన విధానాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. ఎస్సీ, బీసీ, మహిళ, విద్యావంతుల సమ్మేళనంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగింది” అని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ అవినీతిని ఎండగట్టాలి
వైసీపీ దుర్మార్గపు నిర్ణయాలను, అవినీతిని ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎండగట్టాలని, ప్రతిపక్ష నేతల కుటిల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని దేవినేని ఉమా సూచించారు. కాంగ్రెస్ దాష్టికాలను ఎదిరించిన ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ పెద్దల సభలో ప్రజా సమస్యలపై గళమెత్తాలని ఆకాంక్షించారు.
పార్టీకి అంకితభావంతో పనిచేయాలి
నెల్లూరు జిల్లాలో రైతాంగ సమస్యలపై పనిచేసిన బీద రవిచంద్ర యాదవ్ మరింత సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు న్యాయవాదులతో సమన్వయం చేసేందుకు కీలకంగా వ్యవహరించిన బీటీ నాయుడు ప్రజా సమస్యలపై పోరాడాలని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

One thought on “టీడీపీ అభ్యర్థుల ఎంపికపై దేవినేని ఉమా ప్రశంసలు”
Comments are closed.