మాచర్ల నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న హత్యకేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన ఆమె, పాలన వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పల్నాడు జిల్లా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనై ఈ చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వారు ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ప్రాథమిక విచారణ అనంతరం జిల్లా ఎస్పీ వెల్లడించారని గుర్తు చేశారు. మృతుడికి తోట చంద్రయ్య కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్న విషయం కూడా అధికారులు తెలిపారని తెలిపారు.
అయితే, ఆ తర్వాత రాజకీయ జోక్యం కారణంగా పిన్నెల్లి సోదరుల పేర్లను కేసులో చేర్చినట్టు విమర్శించారు. ఇది టీడీపీ లోపలి ఆధిపత్య పోరుకు చెందినదేనని, పిన్నెల్లి సోదరులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మృతుడి కుటుంబ సభ్యులే తొలుత ఇది టీడీపీ అంతర్గత సమస్య వల్ల జరిగిందని చెప్పినప్పటికీ, టీడీపీ ఎమ్మెల్యే ఘటన స్థలాన్ని సందర్శించిన తర్వాత తీరు మారిపోయిందని రజని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు మలుపు తిరిగిందని ఆమె ఆరోపించారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ కాస్తా రాజకీయ సేవగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి” అని ఆరోపించారు. పల్నాడు జిల్లా, గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న పోలీసు దాడులపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రభుత్వాలు శాశ్వతం కావు. పోలీసు యూనిఫాం గౌరవాన్ని కాపాడండి. మేము చట్టబద్ధంగా పోరాడుతాము. బాధ్యులను మేము ఖచ్చితంగా జవాబుదారీగా ఉంచుతాము” అని ఆమె హెచ్చరించింది మరియు పిన్నెల్లి సోదరులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.
ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని విడదల రజని స్పష్టం చేశారు.
Read More : TDP : ఆరు శాసనాలతో కొత్త కార్యాచరణ

One thought on “మాచర్ల హత్యకేసులో పిన్నెల్లి సోదరులపై అన్యాయ ఆరోపణలు.”
Comments are closed.