కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్

raja singh

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్, పోలీసు శాఖతో పెట్టుకోవద్దని హెచ్చరించారు.

రాజాసింగ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) అరెస్ట్ చేసినట్లు గుర్తుచేశారు. పోలీసులు ఏకంగా ఆయన బెడ్‌రూమ్‌లోకి చొచ్చుకెళ్లి అరెస్ట్ చేసి జైలుకు పంపారని అన్నారు. అయితే ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి, అప్పట్లో తనను అరెస్ట్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. కానీ కేటీఆర్ మాత్రం “మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం” అని అంటున్నారని, పోలీసు శాఖను లక్ష్యంగా చేసుకోవద్దని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ కార్యకర్తలపై కేసులు, తనపై పీడీ యాక్ట్

కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన రాజాసింగ్, ఎవరు అధికారంలో ఉంటే వారివిధంగా పోలీసులు పనిచేయడం సహజమని, కేటీఆర్ ఆ విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు. తనపై కూడా పీడీ యాక్ట్ (PD Act) పెట్టి జైలుకు పంపించారని పేర్కొన్నారు.

అయితే తన అరెస్ట్ వ్యవహారంలో షాకింగ్ అంశాన్ని బయటపెట్టిన రాజాసింగ్, ఆ సమయంలో స్వయంగా కొంతమంది బీజేపీ నేతలే పోలీసులకు మద్దతుగా నిలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పోలీసు అధికారి తనతో మాట్లాడిన సందర్భాన్ని వెల్లడిస్తూ, “రాజాసింగ్! నీపై పీడీ యాక్ట్ వేస్తున్నాం. మీ బీజేపీ వాళ్లే ‘వేయండి’ అన్నారు” అని తెలిపారని అన్నారు.

తనపై కుట్ర జరుగుతోందని రాజాసింగ్ వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారుల పరిస్థితి ఏమవుతుందో చూడాలని అన్నారు. అంతేకాదు, తన పార్టీ నుంచే కొంతమంది నేతలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నట్లు తెలిపారు. జైల్లో ఉన్న సమయంలో తన వెంటే అన్నగారు, కార్యకర్తలు నిలబడ్డారని, కానీ ప్రస్తుతం తన అన్న ఎటువైపు ఉన్నారో కూడా తనకు అర్థం కావడం లేదని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

One thought on “కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్

Comments are closed.