CM రేవంత్ రెడ్డి: మాజీ సీఎం కేసీఆర్పై మరోసారి విమర్శలు
ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో నిరుద్యోగ యువతను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని, పది సంవత్సరాల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని విమర్శించారు. “నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి” అని ప్రజలను కోరారు.
ఎంఎల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య సంబంధ బంధం లా పనిచేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరిస్తే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండిపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఓటు వేయాలని చెబుతున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడని బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ కాదని విమర్శించారు. పోటీకి నిలబడని వారు కాంగ్రెస్ను ఎలా ప్రశ్నిస్తారు? అని నిలదీశారు.
ప్రభుత్వ ఉద్యోగాలు & యువత అభివృద్ధి
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించే అవకాశం తక్కువ వచ్చినా 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని, వరంగల్ కు చెందిన దీప్తి కు గ్రూప్-2 ఉద్యోగం ఇచ్చామని తెలిపారు.
రైతులకు మద్దతు & ఆర్థిక భారం
నిజామాబాద్ రైతులు పంజాబ్ రైతులతో పోటీ చేస్తూ అధికంగా పంటలు పండిస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అందించామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఋణాల వల్ల ఇప్పటి వరకు ₹75,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతం అందిస్తున్నామని చెప్పారు.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ లో ₹8,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో నెలకు ₹1,000 కోట్లు చొప్పున చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

One thought on “కేసీఆర్పై మరోసారి విమర్శలు”
Comments are closed.