ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని, దీనిపై నిరంతరం నివేదికలు తెప్పిస్తున్నానని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు పార్టీ నిర్మాణంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. పార్టీ పట్ల నిర్లక్ష్యం వహిస్తే, దీని ప్రభావం అందరిపైనా పడుతుందని హెచ్చరించారు.
ఈరోజు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ భేటీలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే శ్రమించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ కేడర్కు సూచనలు ఇచ్చారు.
తాను నేతలతో పాటు కార్యకర్తలను కూడా త్వరలో పిలిపించి ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలు మరియు ద్వితీయ శ్రేణి నాయకులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. పార్టీ బలహీనపడకుండా సమష్టిగా కృషి చేస్తేనే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించగలమని చెప్పారు.
అంతేకాక, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి నాయకుడు సమర్థంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ప్రజలకు చేరువై, వారి అవసరాలను గుర్తించి, పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.

One thought on “చంద్రబాబు కీలక సూచనలు”
Comments are closed.