రొమ్ము క్యాన్సర్ అవగాహనలో రికార్డు సృష్టించిన డాక్టర్ రఘురాం

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో కిమ్స్ ఆసుపత్రి రొమ్ము క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ రఘురాం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ వేదికగా నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో 11,000 మంది వీక్షించారు.

ఈ ఘనతను పురస్కరించుకొని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని రఘురాం‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రశంస పత్రాన్ని రఘురాం‌కు ఆయన చేతులమీదుగా అందజేశారు.

“రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఆధునిక వైద్యసేవల ద్వారా నయం చేయవచ్చని” వెంకయ్యనాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మహిళల్లో ఆరోగ్యపట్ల అవగాహన కల్పించడం శుభ పరిణామమని ఆయన అన్నారు.

డాక్టర్ రఘురాం మాట్లాడుతూ తన తల్లి కూడా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడిన విషయాన్ని గుర్తుచేశారు. ఆమె స్ఫూర్తితోనే ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రుల ఎండీ భాస్కర్ రావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, వరల్డ్ రికార్డు ప్రతినిధి రిషి నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Read More