బెట్టింగ్ యాప్‌ల కేసు: రీతూ విచారణకు గైర్హాజరు – హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ విష్ణుప్రియ

ritu chaudhary vishnu priya

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో యూట్యూబర్ రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియలకు పంజాగుట్ట పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఈరోజు (మంగళవారం) విచారణకు వారు హాజరు కాలేదు. విచారణకు గైర్హాజరు అయిన రీతూ చౌదరిపై అధికారులు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముండగా, మరోవైపు యాంకర్ విష్ణుప్రియ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణకు గైర్హాజరైన రీతూ చౌదరి

యూట్యూబర్ రీతూ చౌదరికి విచారణకు హాజరుకావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు పంపారు. ఉదయం 11 గంటలకు విచారణకు రానుండగా, ఆమె హాజరు కాలేదు. గతంలోనూ విచారణకు ఆలస్యంగా వచ్చిన రీతూ, ఈసారి విచారణకు పూర్తిగా గైర్హాజరుకావడంతో, మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయింపు

ఇక యాంకర్ విష్ణుప్రియ తనపై మియాపూర్, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం అనంతరం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఇన్ఫ్లుయెన్సర్లపై దృష్టి సారించిన పోలీసులు

ఈ కేసులో మొత్తం 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికే వీరికి నోటీసులు జారీ చేసిన పోలీసులు, కొంత మందిని విచారణకు పిలిచినప్పటికీ, చాలా మంది ఇంకా అందుబాటులో లేరు. హర్షసాయి, ఇమ్రాన్ ఇద్దరూ పరారీలో ఉన్నారు.

పోలీసుల దర్యాప్తు వేగవంతం

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్లు రూపొందించిన వీడియోలను పోలీసులు సేకరించారు. ఈ ప్రమోషన్‌లతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు రావడంతో, యాప్ యాజమానులపై కూడా దృష్టి సారించారు. విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

Read More : అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

One thought on “బెట్టింగ్ యాప్‌ల కేసు: రీతూ విచారణకు గైర్హాజరు – హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ విష్ణుప్రియ

Comments are closed.