పరుగు మాటలు.. హామీల అమలుపై స్పష్టత లేదని వైఎస్ షర్మిల విమర్శ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం పూర్తిగా ప్రజల అంచనాలను మోసగించిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉన్నత స్థాయి అభివృద్ధి హామీలకు ప్రామాణికత లేదని, ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఎలాంటి స్పష్టత లేదని ఆమె విమర్శించారు. మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించి ఏ చిన్న ప్రకటన కూడా లేకపోవడం బాధాకరమని, గత ఎనిమిది నెలల్లో ఏ హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని షర్మిల ఆరోపించారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కూటమి నేతలు వాస్తవాలను చెప్పేందుకు సిద్ధంగా లేరని మండిపడ్డారు.
కూటమి హామీలపై అస్పష్టత.. ప్రజలకు నిరాశ
రాష్ట్ర పునర్నిర్మాణం పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్పా, నాటి మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలను అమలు చేసే స్పష్టత కూడా కూటమి ప్రభుత్వానికి లేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి, నిరుద్యోగ యువత కోసం రూ.3,000 భృతి, తల్లికి వందనం, మహాశక్తి పథకాలు ఎప్పటి నుంచి అమలు అవుతాయో కూడా ప్రభుత్వం చెప్పడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, రైతులు, మహిళలు ఈ పథకాల అమలుపై ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీపై కూడా స్పష్టమైన విధానం ప్రకటించకపోవడం ప్రభుత్వ హఠావతీ ధోరణికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.
Our YouTube Channel Click Here
