సింగపూర్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందుకు పలు కీలక నిర్ణయాలు తీసున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశంలో సింగపూర్ పర్యటన పై స్పందించిన సీఎం.. గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ పై దుష్ప్రచారం చేశారు.. సింగపూర్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేశారు.. అయితే, మళ్లీ సింగపూర్ తో సంబంధాలు పునరుద్ధరణ కోసం ఈ టూర్ ఉపయోగపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం అవుతుందని వెల్లడించారు.

కాగా, నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికార హోదాలో తొలిసారి సింగపూర్ పర్యటనకు సిద్ధం అయ్యారు చంద్రబాబు.. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతోపాటు రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో ఆవిష్కరించాలనే సీఎం అభిమతానికి అనుగుణంగా ఈ పర్యటన కొనసాగుతుందంటున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 27న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో సమావేశం కాబోతున్నారు ఏపీ సీఎం.. విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయులకు వివరించనున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు నారాయణ, లోకేష్, టీజీ భరత్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Read More : విశాఖ, విజయవాడల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు