భవన నిర్మాణాలు, లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు
అమరావతి: భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులపై నిబంధనలను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవోలు జారీ చేసినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవనాలు, లేఅవుట్ల అనుమతుల ప్రక్రియను మరింత సులభం చేస్తూ ఏపీ బిల్డింగ్ రూల్స్ – 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ – 2017లో పలు సవరణలు చేసినట్లు వెల్లడించారు.
సంక్రాంతి కానుకగా నిబంధనల్లో సవరణలు
మంత్రివర్యులు నారాయణ మాట్లాడుతూ, సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిబంధనల్లో అనుకూల మార్పులు చేశామన్నారు. లేఅవుట్లలో రోడ్ల వెడల్పును 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించి సవరణ చేశామని వివరించారు. అదనంగా, 500 చ.మీ. పైబడిన స్థలాలు, నిర్మాణాలకు సెల్లారుకు అనుమతి ఇచ్చే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
ముఖ్య మార్పులు:
- టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ, సబ్-రిజిస్ట్రార్లను తొలగించారు.
- రాష్ట్ర, జాతీయ రహదారుల వద్ద స్థలాల అభివృద్ధి కోసం 12 మీటర్ల సర్వీస్ రోడ్ నిబంధనను రద్దు చేశారు.
- బహుళ అంతస్థుల భవనాలకు సంబంధించిన సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేశారు.
- భవన నిర్మాణ అనుమతులపై మరిన్ని నిబంధనలను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేశారు.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మార్పులతో ప్రజలకు, బిల్డర్లకు అనేక లబ్ధులు చేకూరుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
