ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన పాఠశాల అగ్నిప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మార్క్ చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీనితో అతడిని అత్యవసరంగా సింగపూర్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల సురేఖ కూడా వెంటనే అక్కడికి వెళ్లి ఆసుపత్రిలో మార్క్ను పరామర్శించారు.
తాజాగా జనసేన పార్టీ అధికారికంగా మార్క్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని, వైద్యులు నిర్వహిస్తున్న పరీక్షల ప్రకారం ఊపిరితిత్తుల్లోకి చూరిన పొగ వల్ల తలెత్తే ఇబ్బందులపై నిఘా కొనసాగుతోందని తెలిపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డులోంచి సాధారణ గదికి మార్చినట్లు సమాచారం. మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం మెరుగుపడుతుండటం పవన్ కుటుంబానికి ఊరట కలిగించే విషయంగా మారింది.
మార్క్ శంకర్ గాయాల విషయంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఈ వార్త చాలా బాధ కలిగించింది. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్!” అంటూ తన మద్దతు తెలియజేశారు. ప్రజలు, అభిమానులంతా మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025

One thought on “పవన్ కుమారుడి ఆరోగ్యం నిలకడగా.. అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల!”
Comments are closed.