ప్రజల్లో అవగాహన పెంపుదల లక్ష్యం

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో, యుద్ధ పరిస్థితులు తలెత్తినట్లయితే ప్రజలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర సూచనల మేరకు దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ డ్రిల్‌ దేశ చరిత్రలో సుమారు 50 ఏళ్ల తర్వాత ఇంత విస్తృతంగా నిర్వహించబడుతోంది.

ఈ మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా మొత్తం 244 ప్రాంతాల్లో సాగుతోంది. ప్రజల్లో అప్రమత్తత కలిగించడం, విపత్తు సమయంలో అవసరమైన చర్యలపై అవగాహన పెంచడం ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యం.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ మరియు విశాఖపట్నం నగరాల్లో ఈ డ్రిల్ నిర్వహించబడుతోంది. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్, డీఆర్డీవో, మౌలాలీ వంటి కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతోంది. విశాఖపట్నంలో కూడా రెండు ప్రధాన ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక శాఖ, పోలీసు విభాగం, అత్యవసర సేవల సిబ్బంది పాల్గొంటుండగా, జనాల్లో ఎటువంటి భయం లేకుండా సజావుగా కొనసాగుతోంది. దీనిద్వారా ప్రజలకు విపత్తుల సమయంలో ఎలా స్పందించాలో, ఎటువంటి మార్గాల్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలో సూచనలు అందించబడుతున్నాయి.

ఈ తరహా విన్యాసాలు భవిష్యత్‌ అపాయాలను ఎదుర్కొనడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Read More : “ఆపరేషన్ సిందూర్” విజయవంతం : PM