ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలో పడి ఎంతో మంది కుటుంబాలు బలి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అప్పులు చేసి తీర్చలేక మనస్తాపానికి గురవుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకునే దుస్థితి కనిపిస్తోంది. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు యువతకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
తాజాగా ఆయన ఒక సంఘటనను బయటపెట్టారు. తన వద్ద గన్మ్యాన్గా విధులు నిర్వహించిన ఒక వ్యక్తి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో భారీగా డబ్బులు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయాడని, ఆ పరిస్థితిని తట్టుకోలేక భార్యతో పాటు 5, 7 సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్నారులను తుపాకీతో కాల్చిచంపి ఆ తర్వాత తానే ఆత్మహత్య చేసుకున్నట్లు హరీశ్ రావు గుర్తు చేశారు.
“బెట్టింగ్ యాప్లు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇవి షార్ట్కట్గా డబ్బు సంపాదించాలన్న తలంపును పెంచి మోసగిస్తూ ఉన్నాయ్. ఈ యాప్లు గెలిపించడానికి రూపొందించినవి కావు, నిర్వాహకులకే లాభం చేకూర్చడానికే ఇవి ఉద్దేశించబడ్డాయి” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
అలాంటి యాప్ల నుండి ఎంత దూరంగా ఉంటే, జీవితానికి అంత మేలు జరుగుతుందని యువతకు ఆయన సందేశం ఇచ్చారు.
Read More : “టెట్” ఫీజు భారీగా పెరిగిన విషయం: నిరుద్యోగుల ఆవేదన
