మియాపూర్‌లో విషాదం ?

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి ఉండటం మరింత కలచివేస్తోంది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమికంగా పసికందును హత్య చేసి, మిగతా కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

మరణించిన వారు లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24), అప్పు (2)గా గుర్తించారు. ఈ కుటుంబం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి గ్రామానికి చెందినదిగా, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

ఇక మరో ఘటనలో చందానగర్‌లోని ఓ నాలాలో మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు మృతదేహాన్ని వెలికి తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం చేతిపై “నర్సమ్మ” అనే పచ్చబొట్టు ఉందని, అక్కడి నుంచి ఒక పర్సు, అందులో కమ్మలు, బ్రాస్‌లెట్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More : హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం: సీఎం