పాకిస్థాన్ కుటుంబానికి భారత్‌లో చికిత్స ఆగిపోయే ప్రమాదం

పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు రేపటిలోగా (ఏప్రిల్ 27) భారత్‌ను విడిచిపెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మెడికల్ వీసాలపై భారత్‌లో ఉన్న వారికి మాత్రం ఏప్రిల్ 29 వరకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం ఒక పాకిస్థాన్ కుటుంబానికి తీవ్రమైన సమస్యగా మారింది.

సింధ్ రాష్ట్రం, హైదరాబాద్‌కు చెందిన ఈ కుటుంబం తమ ఇద్దరు చిన్నారుల గుండె చికిత్స కోసం భారత్‌కు వచ్చింది. అయితే, ఇప్పుడు పిల్లల ఆపరేషన్‌కు ముందు భారత్‌ను వదిలి వెళ్ళాలని అధికారులు ఆదేశించడంతో, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

“నా పిల్లలు 9, 7 ఏళ్ల వయస్సులో పుట్టుకతో వచ్చే గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఢిల్లీలో ఉన్న ప్రముఖ హాస్పిటల్‌లో అత్యాధునిక చికిత్స అందుతోంది. పిల్లలకు వచ్చే వారం ఆపరేషన్ జరగాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రయాణం, బస, వైద్యం కోసం రూ.1 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఆపరేషన్‌ జరగకముందే మమ్మల్ని వెళ్ళిపోవాలని చెప్పడం మా కుటుంబానికి తీరని నష్టం,” అంటూ ఆ తండ్రి వాపోయాడు.

జియో న్యూస్‌కు ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, “నా పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దు. దయచేసి వారి చికిత్స పూర్తయ్యే వరకు మాకు అనుమతించండి,” అని భారత్‌, పాకిస్థాన్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు కూడా పిల్లలకు చికిత్స కొనసాగించేందుకు సహకరిస్తున్నారని తెలిపారు. అయితే, విదేశాంగ శాఖ, పోలీసులు వెంటనే ఢిల్లీ విడిచి వెళ్లాలని ఆ కుటుంబానికి సూచించినట్లు పీటీఐ తెలిపింది.

Read More : పహల్గామ్ ఉగ్రదాడిపై టీఆర్‌ఎఫ్ సంచలన ప్రకటన

One thought on “పాకిస్థాన్ కుటుంబానికి భారత్‌లో చికిత్స ఆగిపోయే ప్రమాదం

Comments are closed.