మంగళగిరి అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలకు పట్టాలు ఇచ్చే ప్రభుత్వం అధికారంలో ఉందని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గురువారం “మన ఇల్లు – మన లోకేష్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, తొలి శాశ్వత హౌస్ పట్టాను రాజమండ్రి గోవిందు, సీతామహాలక్ష్మీ దంపతులకు అందజేశారు.

లోకేష్ మాట్లాడుతూ, “లోకేష్ గెలిస్తే ఇళ్లు పీకేస్తారని చేసిన అసత్య ప్రచారాన్ని 10 నెలల్లో తుడిచిపెట్టాం. మూడుదశల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తాం” అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న కీలక హామీలను మంగళగిరి నుంచే ప్రారంభించడం గర్వంగా ఉందని అన్నారు.

మంగళగిరిలో అభివృద్ధి ప్రాధాన్యత

ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 3 వేల మందికి తొలి విడతలో శాశ్వత పట్టాలను అందజేస్తున్నామని లోకేష్ ప్రకటించారు. అధికారంలో లేకపోయినా స్వంత ఖర్చుతో 26 సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం ద్వారా పట్టణాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

అంతేకాక, ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన 100 పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 50కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను మంగళగిరిలో అమలు చేయనున్నట్లు తెలిపారు.

మన ఇల్లు – మన లోకేష్” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన

దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపామని మంత్రి లోకేష్ తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పట్టాలను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఏప్రిల్ 12 వరకు “మన ఇల్లు – మన లోకేష్” కార్యక్రమాన్ని స్వయంగా ఆయన పర్యవేక్షించనున్నారు.