బోధన్లో యువకుల రెచ్చగింపు.. మరో వర్గంపై కత్తులతో దాడి
నిజామాబాద్ జిల్లా బోధన్లో యువకుల కత్తిపోట్ల దాడి స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురు యువకుల ప్రాణాలను హోమం చేసే పరిస్థితి కలిగించింది. గాంధీనగర్కు చెందిన రెహాన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిల్చొని మాట్లాడుకుంటుండగా, ఈ ఘటన జరిగింది.
అపోహతో ప్రారంభమైన వివాదం
స్థానికంగా ఉండే మన్సూర్, వారు తన గురించే మాట్లాడుకుంటున్నారని అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో వెంటనే వారి దగ్గరికి వెళ్లి, “నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?” అంటూ ప్రశ్నించడంతో వివాదం ప్రారంభమైంది. మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఆగ్రహంతో ఇంటికి చేరుకున్న మన్సూర్, తన స్నేహితులు అన్వర్, బాసిత్లకు ఈ విషయాన్ని వివరించాడు.
కత్తులతో దాడి
కోపంతో రగిలిపోయిన మన్సూర్ గ్యాంగ్ వెంటనే కత్తులు పట్టుకుని రెహాన్, జావిద్, బబ్లూలపై దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితుల పరిస్థితి
కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
