ఉచిత బస్సు ప్రయాణం: సంక్రాంతి నుంచి అమలు
అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఈ ఉప సంఘం ఏర్పాటైంది. హోం మంత్రి అనిత, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు.
ఉప సంఘం కీలక అధ్యయనం
పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసి, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
సంక్రాంతి నుంచే అమలు
వచ్చే సంక్రాంతి నుంచే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీనికోసం ఆర్టీసీ సకల ఏర్పాట్లు చేస్తోందని, ఈ పథకం ఆర్టీసీ ఆధ్వర్యంలో సమర్థవంతంగా అమలవుతుందని అన్నారు.
ఆర్టీసీ డిపోల్లో సమూల మార్పులు
పార్వతీపురం మన్యం జిల్లా: ఆర్టీసీ డిపోల్లో నూతన భవనాలను నిర్మించడం ప్రారంభించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ సేవల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యమని, కొత్త బస్సు సర్వీసులు ప్రారంభించడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించగలమని వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థిక భారం తగ్గిస్తామని, ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మేలును చేకూర్చుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
