వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని స్పష్టంగా ప్రకటించారు. సరైన సమయం వచ్చిన వెంటనే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతారని వెల్లడించారు. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఈరోజు షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్లారు. పర్యటనకు ముందు హైదరాబాద్లోని నివాసంలో అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం కర్నూలు చేరుకున్న ఆయన, స్థానిక ఉల్లి మార్కెట్లో రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన షర్మిలే తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు.
ఇటీవల పులివెందులలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళి కార్యక్రమంలో రాజారెడ్డి తన తల్లి పక్కనే కూర్చోవడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వేడెక్కాయి. తాజాగా కర్నూలు పర్యటనలో ప్రత్యక్షంగా పాల్గొనడం, షర్మిల దీనిపై స్పష్టత ఇవ్వడంతో ఆ వార్తలకు పూర్తి స్థాయిలో బలం చేకూరింది.
వైఎస్ రాజారెడ్డి అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేశారు. గతేడాది చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియా అట్లూరిని వివాహం చేసుకున్నారు.
Read More : ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్న మంత్రి నారా లోకేశ్.