తిరుమలలో హై అలర్ట్

భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య పరిస్థితులు తీవ్రంగా మారాయి. సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతూ, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్‌ సైన్యం మాత్రం దీటుగా స్పందిస్తూ పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ పరిణామాల మధ్య సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తిరుమలలో కూడా భద్రతను బలోపేతం చేశారు. శనివారం తిరుమలలో హై అలర్ట్‌ అమలులో ఉండటంతో ఆక్టోపస్‌ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే మార్గాల్లో పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌, సెక్యూరిటీ విభాగం, డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌లతో కలిసి ఆక్టోపస్‌ బలగాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనూహ్య పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. భద్రతా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Read More : అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు