ఢిల్లీలో రెండో షోరూమ్‌ ప్రారంభం

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత మార్కెట్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన నెల రోజుల్లోనే, దేశ రాజధాని ఢిల్లీలో రెండో షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఆగస్టు 11న ఈ కొత్త టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ఏరోసిటీ ప్రాంతంలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ముంబై తర్వాత ఢిల్లీలో కూడా తమ కారు ప్రియులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించనుంది.

భారత మార్కెట్లో టెస్లా ‘మోడల్ వై’
టెస్లా గత నెలలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. అదే సమయంలో తమ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ అయిన ‘మోడల్ వై’ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 60 లక్షలు. ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి ‘మోడల్ వై’ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

‘మోడల్ వై’ ఫీచర్లు

  • ‘మోడల్ వై’ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
  • స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్: 60 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
  • లాంగ్-రేంజ్ వేరియంట్: 75 kWh బ్యాటరీతో 622 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
  • తొలి దశలో ముంబై, పుణె, ఢిల్లీ, గురుగ్రామ్‌ నగరాల్లోని వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
  • అదనంగా రూ. 6 లక్షలు చెల్లిస్తే ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ (FSD) ఫీచర్‌ను కూడా భవిష్యత్తులో పొందవచ్చు.

టెస్లా తమ వెబ్‌సైట్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. డెలివరీలను నేరుగా వినియోగదారుల ఇంటికే ఫ్లాట్-బెడ్ ట్రక్కుల ద్వారా అందించనున్నారు.

Read More : వెబ్ సిరీస్ ప్రభావంతో బాలుడి ఆత్మహత్య