తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ఘనమైన సంస్కృతి నిలయం అని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు.
రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ప్రజల సంక్షేమం కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని గుర్తుచేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా స్వీకరించామని తెలిపారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందని గవర్నర్ తెలిపారు.
రైతులకు మద్దతివ్వడం, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో 23.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని, ఎకరానికి రూ.12 వేలు చొప్పున రైతులకు అందిస్తున్నామని తెలిపారు. రైతు నేస్తం అమలు చేస్తూ, రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నట్టు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

2 thoughts on “తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం”
Comments are closed.