రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొడతారు..! ఐదేళ్లు అధికారంలో ఉండాలి – కేటీఆర్ ఘాటుగా

తెలంగాణలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా, తమ పార్టీ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

‘‘రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండాలి. ప్రజలకు సహనం తాళలేక పోయినప్పుడు వాళ్లే రోడ్డెక్కి ఈ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్‌ తరహాలో తొక్కుతారు. ఇది మాలాంటి వారికేమీ చేయాల్సిన పని కాదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రజల్లో అసహనం అంతిమ స్థాయికి చేరిందని, రేవంత్ పాలనపై స్వయంగా ప్రజలు తమ వద్దకు వచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెబుతున్నారని పేర్కొన్నారు. అయినా తమ అభిప్రాయం స్పష్టంగా ఉందని, ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తి ఐదేళ్లు అవకాశం ఇవ్వాలనే తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘‘ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డి అధికారంలో కొనసాగితే, తదుపరి 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు ఓటేయాలంటే ప్రజలే భయపడతారు’’ అని ఎద్దేవా చేశారు.

అలాగే ఫార్ములా-ఈ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించిన కేటీఆర్, ‘‘మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న సమయంలో నేనెప్పుడూ అధికారులను బలిపశువులుగా చేయలేదు. బీఆర్‌ఎస్‌లో మంచి జరిగితే మా పేరు, చెడు జరిగితే అధికారులపై నెట్టే అలవాటు లేదు. అది మా పార్టీకే కాని సంస్కృతి కాదు’’ అని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీయగా, రాబోయే రాజకీయ సమీకరణాలపై స్పష్టత కలిగిస్తున్నాయి.