ఫుకెట్ ఎయిర్ ఇండియా విమానంలో బాంబు కలకలం

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈరోజు ఉదయం తీవ్ర కలకలం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు సందేశం రావడంతో, వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటికే విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఏరోనాటికల్ రేడియో ఆఫ్ థాయ్‌లాండ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 379 విమానం టేకాఫ్ అయిన తర్వాతే పైలట్‌కు బాంబు బెదిరింపు సమాచారం అందింది. వెంటనే అనుమతి తీసుకుని విమానాన్ని తిరిగి ఫుకెట్‌కు మళ్లించారు. దీంతో అక్కడి అధికారులు ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించించి భద్రతా ప్రాంతానికి తరలించారు.

అనంతరం సెక్యూరిటీ బృందాలు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి. ప్రాథమిక సోదాల్లో బాంబు లభించకపోయినా, విమానంలో బాంబు బెదిరింపు నోటు దొరికిందని అధికారులు ధ్రువీకరించారు. ఈ నోటును ఎవరు రాశారు, ఎక్కడ ఉంచారు అనే దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. నోటును కనుగొన్న ప్రయాణికుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల భారతీయ విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గతేడాది తొలి పది నెలల్లోనే దాదాపు 1,000 వరకు తప్పుడు బెదిరింపులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఘటన విమానయాన భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది.

రవాణా మంత్రిత్వ శాఖ, ఫుకెట్ విమానాశ్రయ అధికారులు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : విమాన ప్రమాదానికి FADEC సిస్టమ్ వైఫల్యమే కారణం?