25% సుంకాల హెచ్చరిక చేసిన ట్రంప్

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆగస్టు 1 గడువు ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఒప్పందం కుదరకపోతే భారత్‌పై 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అవకాశముందని ట్రంప్ హెచ్చరించారు.

“భారత్ 25 శాతం సుంకాలు చెల్లించాల్సి వస్తుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా మిత్రదేశమేనని, తన అభ్యర్థన మేరకు పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ముగించిందని కూడా పేర్కొన్నారు.

గడువులోపు ఒప్పందం కుదరకపోతే భారత్ నుంచి కొన్ని ఎగుమతులపై 20 నుంచి 25 శాతం వరకు సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే కొత్త రాయితీలపై తొందరపడకుండా, ఆగస్టు మధ్యలో అమెరికా బృందం సందర్శన సమయంలో వాణిజ్య చర్చలను పునఃప్రారంభించాలని భారత్ యోచిస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యమని భారత అధికారులు తెలిపారు.

చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ వ్యవసాయం, పాడి రంగాలు వివాదాస్పద అంశాలుగా మిగిలాయి. సోయాబీన్‌, మొక్కజొన్న వంటి జన్యుపరంగా మార్పు చేసిన పంటల దిగుమతులను భారత్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. పాడి మార్కెట్‌ను తెరవడంపై కూడా భారత్ సుముఖంగా లేదు.

ట్రంప్ గ్లోబల్‌ సుంకాల వ్యూహాన్ని కూడా సూచించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు లేని చాలా దేశాలు త్వరలో 15 నుంచి 20 శాతం వరకు అమెరికా సుంకాలను ఎదుర్కోవచ్చని తెలిపారు. ఇది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 10 శాతం బేస్‌లైన్‌ సుంకం కంటే ఎక్కువ. త్వరలో 200 దేశాలకు కొత్త ‘వరల్డ్‌ టారిఫ్‌’ రేటును అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది.

2024లో భారత్–అమెరికా వాణిజ్యం సుమారు 129 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Read More : రష్యాను 8.8 తీవ్రత భూకంపం కుదిపేసింది