హిందూ ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఆయా ఆలయాల నుంచి వచ్చే నిధుల వినియోగం, వాటి స్వతంత్రతపై కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లోక్సభలో చర్చించారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న హిందూ ఆలయాల నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారా, లేదంటే వాటి ఖర్చులు స్వతంత్రంగా ఉంటున్నాయా అన్న అంశంపై ప్రశ్నలు వేశారు.
అలాగే, ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నియంత్రణ అమలు చేస్తున్నాయో కూడా ఆయన అడిగారు. హిందూ ఆలయాలకు స్వతంత్రత ఇవ్వాలని, మత సంస్థలు ఈ అంశంపై కేంద్రానికి డిమాండ్ చేసాయా అన్న విషయాలను కూడా చర్చించారు.
ఈ చర్చకు స్పందిస్తూ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హిందూ ఆలయాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చారు. ఆయన, దేశవ్యాప్తంగా 3,698 చారిత్రక కట్టడాలు, పురాతన నిర్మాణాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వాటిగా వర్గీకరించారని తెలిపారు. ఆర్కియాలాజికల్ సైట్స్ అండ్ రిమెయిన్స్ యాక్ట్ 1958 ప్రకారం వీటిని పరిరక్షిస్తున్నామని, 2023-24 సంవత్సరంలో ఈ కట్టడాల నుండి రూ. 317.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.
అలాగే, ASI పరిధిలోని ఆలయాలకు స్వతంత్రత ఇవ్వాలని కోరిన డిమాండు కేంద్రానికి రాలేదని, నిధులను భారత పురావస్తు శాఖ పురాతన కట్టడాల పరిరక్షణ కోసం మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు.

One thought on “జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హిందూ ఆలయాల నిధులపై లోక్సభలో చర్చ”
Comments are closed.