నాంపల్లి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల అర్ణవ్ విషాదాంతం చెందాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
నిన్న శాంతి అపార్ట్మెంట్లో లిఫ్ట్ బయటికి వస్తుండగా, కాలు బయట పెట్టిన సమయంలో డోర్ అకస్మాత్తుగా మూసుకోవడంతో బాలుడు లోపల ఇరుక్కుపోయాడు. ఈ ఘటనతో అతని శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న డీఆర్ఎఫ్ బృందం అత్యవసరంగా ఘటనాస్థలానికి చేరుకుని 90 నిమిషాల పాటు కష్టపడి బాలుడిని బయటికి తీశారు. అయితే అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఆస్పత్రికి తరలించిన తర్వాత వెంటిలేటర్పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. వైద్యుల ప్రకారం, మెదడుకు, గుండెకు ఆక్సిజన్ సరఫరా పడకపోవడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఈ ఉదయం బాలుడి పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటికే తుది శ్వాస విడిచాడు. తల్లిదండ్రులు తమ కన్నబిడ్డను ఇలా కోల్పోవడం తట్టుకోలేక శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
