డ్రీమ్ 11 వైదొలుగు: టీమిండియాకు షాక్

భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ సంస్థ డ్రీమ్ 11 అర్ధాంతరంగా ఒప్పందం నుంచి తప్పుకుంది. రూ.358 కోట్ల భారీ ఒప్పందాన్ని రద్దు చేసినప్పటికీ, బీసీసీఐకి ఎటువంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం విశేషం. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టమే ఈ పరిణామానికి కారణమైంది.

డ్రీమ్ 11 ప్రతినిధులు నేరుగా బీసీసీఐ కార్యాలయాన్ని సందర్శించి, తమ నిర్ణయాన్ని సీఈఓ హేమాంగ్ అమిన్‌కు తెలియజేశారు. “కొత్త చట్టం కారణంగా స్పాన్సర్‌షిప్ కొనసాగించడం సాధ్యం కాదని వారు మాకు స్పష్టం చేశారు. అందువల్ల రాబోయే ఆసియా కప్‌లో వారు స్పాన్సర్‌గా ఉండరు. కొత్త స్పాన్సర్ కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తాం” అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఒప్పందంలోని ప్రత్యేక క్లాజ్ ప్రకారం, కొత్త చట్టాల కారణంగా వ్యాపారానికి ఆటంకం కలిగితే, జరిమానా లేకుండా స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడానికి డ్రీమ్ 11కు అవకాశం ఉంది. ఆ వెసులుబాటు వల్లే బీసీసీఐకి నష్టపరిహారం చెల్లించకుండా ఒప్పందం రద్దు చేసింది.

2023లో బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 ప్రధాన స్పాన్సర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు ఈ అనూహ్య నిర్ణయం బీసీసీఐకే కాకుండా మొత్తం క్రికెట్ ప్రపంచంపై ప్రభావం చూపనుంది. డ్రీమ్ 11 ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీలతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.

ఇదే సంస్థ గతంలో ఇండియా-చైనా ఉద్రిక్తతల సమయంలో వివో తప్పుకున్నప్పుడు 2020లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్, న్యూజిలాండ్ ‘సూపర్ స్మాష్’ వంటి టోర్నీలకు కూడా స్పాన్సర్‌గా నిలిచింది. ఐపీఎల్ స్థాయి ఆర్థిక శక్తి లేని ఈ లీగ్‌లు భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కొనే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లులో, ఈ రంగం ద్వారా ఆర్థిక మోసాలు, మనీలాండరింగ్, పన్ను ఎగవేతలు పెరిగిపోతున్నాయని, దేశ భద్రతకే ముప్పు కలుగుతోందని స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే.

Read More : క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం