హోంమంత్రి అనిత పాయకరావుపేట పర్యటన

Home Minister Vangalapudi Anitha

ఈరోజు పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదిన్నరలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తరువాత ఆమె పాయకరావుపేటలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించి జమదాని చీరల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ – జమదాని చీరలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే చర్యలు తీసుకుంటామని అన్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చేనేత రంగానికి అవసరమైన మద్దతు అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని హామీ ఇచ్చారు. ఇకపోతే, వైసీపీ అధినేత జగన్‌పై హోంమంత్రి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జగన్ మానవత్వం ఉన్న వ్యక్తిలా కాకుండా, హీనంగా ప్రవర్తిస్తున్నారు” అంటూ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మండిపడ్డారు. 50 వేల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తగవని, కోర్టులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్ మాత్రం మౌనంగా ఉండటం దారుణమన్నారు.

‘‘రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లిపై కూడా జగన్ తప్పుడు ప్రచారం చేశాడు. ఇది ఆయన నీచ రాజకీయాల ప్రతిబింబం’’ అని అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రౌడీషీటర్లను, బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డవారినే పరామర్శించే జగన్, ప్రజాప్రతినిధుల మనోభావాలను లెక్క చేయడం లేదన్నారు.

జగన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రజలు స్వయంగా ఆలోచించాలని ఆమె సూచించారు. ‘‘ప్రసన్నకుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.

Read More : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సీపీఐ నారాయణ స్పందన