స్వర్ణ దేవాలయాన్ని భారత సైన్యం రక్షించిందేలా!

మే 8న పంజాబ్‌లోని అమృత్‌సర్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ తీవ్రదాడికి యత్నించింది. పవిత్ర స్వర్ణ దేవాలయం మీదుగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడ్డ పాకిస్థాన్ కుట్రను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ దాడిలో స్వర్ణ దేవాలయం ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తమైన భారత వైమానిక రక్షణ దళాలు ఆ దుష్ట ప్రయత్నాన్ని పూర్తిగా భగ్నం చేశాయి.

సైన్యంలో 15వ ఇన్ఫాంట్రీ డివిజన్‌కు చెందిన జీఓసీ మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ ఘటనపై సోమవారం వివరాలు వెల్లడించారు. “పాకిస్థాన్ దాడికి ముందే మేము వారి ఉద్దేశాలను అంచనా వేసాం. మతపరమైన ప్రదేశాలపై దాడికి అవకాశం ఉందని గ్రహించి, ప్రత్యేక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించాం. స్వర్ణ దేవాలయంపై దాడి చేయడానికి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను మేము పూర్తిగా కూల్చివేశాం,” అని చెప్పారు.

భారత సైన్యం ప్రదర్శన ద్వారా – పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్, ఇతర ప్రదేశాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఎల్-70 ఎయిర్ డిఫెన్స్ గన్‌ల సహాయంతో ఎలా రక్షించామో వివరించింది.

పాకిస్థాన్ ఇటీవల ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్‌కు ప్రతీకారంగా ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. కానీ భారత సైన్యం అపూర్వ నైపుణ్యంతో, సమర్థతతో దేశ గౌరవాన్ని కాపాడింది. స్వర్ణ దేవాలయానికి చిన్న గీత కూడా పడకుండా రక్షించిన భారత ఆర్మీపై దేశమంతా గర్విస్తుంది.

Read More : సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన.

One thought on “స్వర్ణ దేవాలయాన్ని భారత సైన్యం రక్షించిందేలా!

Comments are closed.