ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం బీభత్సం.

ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం రాత్రి సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కునార్ ప్రావిన్స్‌లోని పలు జిల్లాల్లో అధిక మృతులు నమోదైనట్లు ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖ అనడోలు వార్తా సంస్థకు వెల్లడించింది.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:47 గంటలకు భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.0గా నమోదైందని, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వివరించింది. ఈ కేంద్రం బసావుల్ పట్టణానికి సుమారు 36 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్నట్టు గుర్తించారు. లోతు తక్కువగా ఉండటంతో నష్టం తీవ్రంగా జరిగిందని నిపుణులు తెలిపారు.

కునార్ ప్రావిన్స్‌లోని నూర్ గల్, సావ్కి, వాత్‌పుర్, మనోగీ, చపా దారా జిల్లాల్లో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రభావం కాబూల్‌తో పాటు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు విస్తరించింది. అక్కడ కూడా కొన్ని సెకన్లపాటు భవనాలు కంపించాయని ఏఎఫ్‌పీ జర్నలిస్టులు తెలిపారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, గతేడాది అక్టోబర్ 7, 2023న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ విపత్తులో కనీసం 4,000 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ ప్రభుత్వం అంచనా వేయగా, ఐక్యరాజ్యసమితి మాత్రం మృతుల సంఖ్యను సుమారు 1,500గా ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఆ భూకంపం దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా నిలిచింది.

Read More : జపాన్‌లో బుల్లెట్ రైలు ప్రయాణం చేసిన మోదీ.