ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో స్పెషల్ నీడ్స్ పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను 125 కొత్త స్పెషల్ నీడ్స్ సెంటర్లను ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
మున్సిపాలిటీల్లో 125 కొత్త సెంటర్లు
లోకేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ద్వారా 21 రకాల దివ్యాంగుల్లో 9 రకాల వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ అందించాలని నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు పనిచేస్తున్నాయని, వీటిలో 41,119 మంది విద్యార్థులు నమోదైనట్లు తెలిపారు. ప్రతి సెంటర్లో ఇద్దరు ఐఈఆర్ టీచర్లు విధులు నిర్వహిస్తున్నారని, మొత్తం 1,358 మంది టీచర్లు ఉన్నారని వివరించారు.
ప్రైవేటు సంస్థల వసూళ్లపై ఆందోళన
స్పెషల్ నీడ్స్ పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఆ అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేటు సంస్థలు రూ.50 వేలు వరకూ వసూలు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు ప్రతి మున్సిపాలిటీలో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నిధుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే 100 శాతం ఆమోదం పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీచర్-స్టూడెంట్ రేషియో
స్పెషల్ నీడ్స్ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రైమరీ తరగతుల్లో 1:10, సెకండరీ తరగతుల్లో 1:15 టీచర్-స్టూడెంట్ రేషియోను పాటించాల్సిన అవసరం ఉందని లోకేష్ తెలిపారు. సెకండరీ స్థాయిలో మరింత మంది టీచర్ల నియామకం అవసరమని స్పష్టం చేశారు.
కొత్త టెక్నాలజీపై సమీక్ష
సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, కొత్త టెక్నాలజీ, టీచింగ్ పద్ధతులపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్పెషల్ నీడ్స్ పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

One thought on “స్పెషల్ నీడ్స్ పాఠశాలలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన”
Comments are closed.