ఇటీవల కాలంలో కర్ణాటక ప్రభుత్వం ఏదో ఒక విషయంతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల గ్రాంట్ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. పార్టీలో అంతర్గతంగా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.
తమ నియోజవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు సరిపోవడం లేదని కర్ణాటక పార్టీ ఇంఛార్జి రణదీప్ సూర్జేవాలా వద్ద ఇటీవల ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు. బెంగళూరులోని పార్టీ ఆఫీస్ లో విడివిడిగా ఒక్కో ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడారు. నిధుల జాప్యంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని సూర్జేవాలా సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్గతంగా జరిగిన చర్చ అనంతరం.. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న కేటాయింపుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దీంతో ప్రతి ఎమ్మెల్యే రూ.50 కోట్ల గ్రాంట్ ను పొందనున్నారు.
ఇదిలా ఉంటే, నిధుల విడుదలలో జాప్యంపై ఎమ్మెల్యేల్లో కొద్దికాలంగా తీవ్ర అసహనం నెలకొంది. ఈ విషయమై గత నెల కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కగే.. సొంత ప్రభుత్వంపై బహిరంగంగా అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదని, ఈ వైఫల్యంపై తాను నిరాశ చెందానని విమర్శలు చేశారు. అలాగే రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం వెలువడింది.
ఇదిలా ఉంటే, కొద్దిరోజులుగా కర్ణాటక రాజకీయాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతుండటం, అగ్రనాయకులు వాటిని తోసిపుచ్చుతున్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోపక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కోసం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేరసారాలు మొదలుపెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వాళ్లిద్దరూ సిద్ధంగా ఉన్నారని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వాదనను తోసిపుచ్చుతూ.. ఈ విధంగా స్పందించింది. ఇదిలా ఉండగా సీఎం మార్పు విషయానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో మాత్రం తెలియట్లేదు.
Read More : యెమెన్ మరణశిక్ష కేసులో నిమిష ప్రియకు సుప్రీం కోర్టు ఊరట

2 thoughts on “కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య”
Comments are closed.