భారత్‌లో టిక్‌టాక్ నిషేధం కొనసాగుతూనే ఉంది ? కేంద్రం స్పష్టం

భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేశారన్న వార్తలు పూర్తిగా వదంతులేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టిక్‌టాక్‌తో పాటు షేన్, అలీఎక్స్‌ప్రెస్ వంటి చైనా యాప్‌లపై నిషేధం ఇప్పటికీ కొనసాగుతోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఇటీవలి రోజుల్లో కొంతమంది యూజర్లు తమ ఫోన్లలో టిక్‌టాక్ వెబ్‌సైట్ హోమ్‌పేజీకి యాక్సెస్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. దీంతో ఐదేళ్ల తర్వాత టిక్‌టాక్ మళ్లీ భారత్‌లోకి వస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే, వెబ్‌సైట్ ఓపెన్ అవుతున్నప్పటికీ వీడియోలు చూడడం లేదా ఇతర ఫీచర్లు ఉపయోగించడం సాధ్యం కాకపోవడంతో ఈ వార్తలు తప్పుడు వేనని తేలింది.

ఈ వదంతులపై స్పందించిన కేంద్రం, 2020లో విధించిన నిషేధం ఇప్పటికీ అమల్లోనే ఉందని మరోసారి స్పష్టంచేసింది. లద్దాఖ్‌లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణ అనంతరం జాతీయ భద్రత, డేటా గోప్యత కారణాలతో జూన్ 29, 2020న టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే.

అప్పట్లో నిషేధానికి గురైన కొన్ని యాప్‌లు మార్పులు చేసుకుని లేదా క్లోన్ వెర్షన్ల రూపంలో మార్కెట్లోకి మళ్లీ వచ్చాయి. అయితే, టిక్‌టాక్‌పై మాత్రం ప్రభుత్వం కఠినమైన నిషేధాన్ని కొనసాగిస్తోంది. తాజా ప్రచారంతో మరోసారి ఈ విషయంపై కేంద్రం స్పష్టతనిచ్చింది.

Read More : పింప్రి-చించ్వాడ్‌లో వీధి కుక్కల దాడి