కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పరిశ్రమలకు కీలక సూచనలు చేశారు. పరిశ్రమలు ఎప్పటికప్పుడు జీఎస్టీ మరియు పన్నుల్లో తగ్గింపును కోరడం మానుకోవాలని సూచించారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి తగిన నిధులు అవసరమని స్పష్టం చేశారు.
“పన్ను తగ్గిస్తే.. మళ్లీ మరిన్ని తగ్గింపులు కోరుతారు. ఇది మానవ స్వభావమే,” అని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు తమ వ్యాపార అవసరాల కోసం పన్నులలో కోతను నిరంతరం డిమాండ్ చేయడం తగదని సూచించారు.
గడ్కరీ చెప్పిన ప్రకారం, దేశంలోని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, రవాణా రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులకు ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పన్నులను తగ్గిస్తే సంక్షేమ కార్యక్రమాలు ప్రభావితం అవుతాయని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రంగాలకు ప్రోత్సాహక చర్యలు తీసుకుంటోందని, కానీ అవసరమైన స్థాయిలో ఆదాయం లేకుంటే ప్రజలకు అవసరమైన సేవలు అందించడం కష్టమవుతుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.
