భారత్‌లో చిన్న చిప్‌ – ప్రపంచాన్ని మార్చే శక్తి : ప్రధాని మోదీ.

ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో సెమీకండక్టర్ రంగం భవిష్యత్తుపై బలమైన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ‘ఇండియా సెమీకాన్ 2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, “భారత్‌లో తయారైన అతి చిన్న చిప్ కూడా ప్రపంచంలో అతిపెద్ద మార్పులను తెస్తుంది. ఈ రంగంలోకి ఆలస్యంగా వచ్చినా, ఇప్పుడు మన పురోగతిని ఎవరూ అడ్డుకోలేరు” అని స్పష్టం చేశారు. మోదీ తెలిపారు… “20వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెట్రోలియం నడిపితే, 21వ శతాబ్దపు భవిష్యత్తును సెమీకండక్టర్లు నిర్ణయిస్తాయి. ఒకప్పుడు చమురు బావుల నుంచే ప్రపంచ శక్తి వచ్చేది, కానీ నేడు ఆ శక్తి చిన్న చిప్‌లో దాగి ఉంది. పరిమాణంలో చిన్నదైనా, ప్రపంచ ప్రగతిని వేగవంతం చేసే శక్తి దీనికుంది” అన్నారు.

ఈ కార్యక్రమానికి 40కుపైగా దేశాల ప్రతినిధులు హాజరుకావడం, భారత్ యువశక్తి, ఆవిష్కరణలపై ప్రపంచ నమ్మకానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. “ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోంది. మనతో కలిసి సెమీకండక్టర్ భవిష్యత్తును నిర్మించేందుకు సిద్ధంగా ఉంది” అని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లుగా ఉందని, త్వరలో ఇది 1 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేశారని మోదీ గుర్తుచేశారు. పెట్టుబడిదారులు భారత్ వైపు చూడటానికి ఇది ప్రధాన కారణమని అన్నారు. ఇకపై కేవలం బ్యాక్-ఎండ్ పనులకే కాకుండా, డిజైన్ నుంచి తయారీ వరకు పూర్తి సామర్థ్యంతో భారత్ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.

“మా ప్రభుత్వ విధానాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కావు. దీర్ఘకాలిక లక్ష్యాలతో రెండో దశ సెమీకండక్టర్ మిషన్‌పై దృష్టి పెట్టాం. భవిష్యత్తులో మన గుర్తింపు ‘డిజైన్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా’గా నిలుస్తుంది” అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Read More : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను