మాంచెస్టర్ టెస్టు డ్రా – జడేజా, సుందర్ అజేయ శతకాలు

మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చివరి వరకూ పోరాడి అందరి ప్రశంసలు పొందారు. అయితే మ్యాచ్‌ ముగింపు సమయంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా సెంచరీలకు చేరువలో ఉన్న వేళ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్ మ్యాచ్‌ను డ్రాగా ముగిద్దామని ప్రతిపాదించాడు. ఈ నిర్ణయానికి మిగతా ఆటగాళ్లు కూడా మద్దతు తెలుపుతూ భారత ఆటగాళ్లపై ఒత్తిడి తెచ్చారు. అయితే భారత క్రికెటర్లు ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించారు. దీంతో స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ “బ్రూక్‌, డకెట్ బౌలింగ్‌లో సెంచరీలు చేయాలనుకుంటున్నావా?” అంటూ జడేజాపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. దీనికి జడేజా తనదైన శైలిలో సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై క్రీడా విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వ‌రగా సెంచరీలు పూర్తిచేయమనే ఉద్దేశ్యంతో బ్రూక్‌, రూట్‌ బౌలింగ్ చేసిన తీరుపై కూడా వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చివరి వరకూ క్రీజులో నిలబడి అజేయ శతకాలతో జడేజా, సుందర్‌ భారత్‌ను గట్టెక్కించడమే కాకుండా ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు గట్టి సమాధానం చెప్పినట్లయ్యారు.

Read More : జర్మనీలోని వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత క్రీడాకారుల ఘనత