హర్యానాలో టెన్నిస్ క్రీడాకారిణి హత్యపై మిస్టరీ

హర్యానాలో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసు నాటకీయ మలుపులు తీసుకుంటోంది. ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఈ హత్యకు ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. తన సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నావని కుమార్తె అవహేళనగా మాట్లాడిందని, అందుకే ఆమెను కాల్చిచంపినట్టు దీపక్ పోలీసులకు తెలిపాడు. అయితే, అతని వాదనపై కుటుంబ సన్నిహితులు, స్థానికులు తీవ్రంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాధికా యాదవ్ రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా పేరొందిన ఆమె, కోచ్‌గా కూడా సేవలందిస్తుండేది. గురుగ్రామ్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న రాధికాను నిన్న తండ్రి వెనుక నుంచి కాల్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటన జరిగిన సమయంలో ఆమె వంటచేస్తుండగా, దీపక్ తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
కానీ దీపక్ తెలిపిన కారణం నిజం కాదని పలువురు అంటున్నారు. ఆయనకు నెలకు రూ. 15 నుంచి రూ. 17 లక్షల వరకు అద్దె, ఇతర ఆదాయ మార్గాల ద్వారా డబ్బు వచ్చేది అని తెలిపారు. అంతేకాకుండా గురుగ్రామ్‌లో విలాసవంతమైన ఫామ్‌హౌస్ కూడా అతని పేరుతో ఉందని చెప్పారు. అతనికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితిలో ఇలా కుమార్తెపై ఆధారపడి ఉన్నట్టు చెప్పడం వాస్తవాన్ని బలహీనపరుస్తోందని అభిప్రాయపడుతున్నారు.

కుమార్తెపై దీపక్‌కు ఎంతో ప్రేమ ఉండేదని, ఆమె కెరీర్ కోసం రూ. 2 లక్షలతో రాకెట్లు కూడా కొనిచ్చాడని కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఈ హత్య వెనుక వేరే కారణం ఉండవచ్చని అనుమానాలు గాఢమవుతున్నాయి. పోలీసులు విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.

Read More : ఆపరేషన్ సిందూర్‌పై దోవాల్ స్పష్టత