హైదరాబాద్: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) వెంటనే స్పందించి భూ అక్రమాలపై సమీక్ష చేపట్టారు. ఇటీవల ‘ప్రజావాణి’లో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం అల్వాల్ మండలంలోని తిరుమలగిరి గ్రామం లోతుకుంటలో రంగనాథ్ స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
ఫిర్యాదులో దాదాపు 100 ఎకరాల మేర ప్రభుత్వ చెరువు భూమి అక్రమంగా ఆక్రమించబడిందని సమాచారం అందింది. ఈ స్థలం జనరల్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ భూమిగా నమోదుకాగా, కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమదిగా పేర్కొంటున్నట్లు తెలిసింది.
ఈ విషయంపై రంగనాథ్ స్పందిస్తూ, వంద ఎకరాలకు పైగా ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతించరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం రంగనాథ్ గండిమైసమ్మ మండలం దుండిగల్ గ్రామంలోని బుబ్బఖాన్ చెరువు దిగువన ఉన్న లింగం చెరువు కాలువ పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా, హఫీజ్పేట ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారాన్ని ఆయన పరిశీలించారు.
హఫీజ్పేటలో టీడీఆర్ (TDR) కింద లబ్ధి పొంది ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడ్డారా అనే అంశంపై విచారణ జరపాలని అధికారులకు రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

One thought on “ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ పర్యటన.. భూమి ఆక్రమణలపై దృష్టి”
Comments are closed.