తిరుమల శ్రీవారి ఆలయం గోపురంపై మరోసారి విమానం సంచరించడం భక్తుల ఆందోళనకు కారణమైంది. ఆగమ నిబంధనలను పట్టించుకోకుండా తిరుమల ఆలయం మీదుగా విమానాలు ప్రయాణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది.
తిరుమల, ఫిబ్రవరి 20: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా తరచుగా ఆలయం పైగా విమానాల సంచారం కొనసాగుతుండటం భక్తుల ఆవేదనకు కారణమవుతోంది. అయితే, ఈసారి మాత్రం విమానం చాలా తక్కువ ఎత్తులో వెళ్ళిందని భక్తులు గమనించారు. ఆగమ నియమాల ప్రకారం ఆలయం పైనుంచి ఎలాంటి వాహన రాకపోకలు ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, తరచుగా ఇలా జరగడం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది.
ఇటీవల తిరుమల గగనతలంలో విమానాల సంచారం పెరిగినట్టు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆలయం సమీపంలో ఇలా విమానాలు తిరుగుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం భక్తులను మరింత అసంతృప్తికి గురిచేస్తోంది.
ఈరోజు కూడా ఓ విమానం ఆలయ గోపురం పైనుగా వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఆలయ పరిసరాల్లో విమానాల రాకపోకలను నివారించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు అంటున్నారు. టీటీడీ ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖకు ఈ సమస్యపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా, ఎటువంటి సమాధానం రాలేదని సమాచారం.
ఇటీవల తిరుమలలో పర్యటించిన హోంమంత్రి అనిత ఈ అంశంపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల అప్రమత్తంగా ఉందని, దీనిపై దర్యాప్తు జరిపి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. నివేదికలు వచ్చిన వెంటనే ఆలయం పైనుంచి విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు.

One thought on “తిరుమల శ్రీవారి ఆలయం పైగా విమానం సంచారం”
Comments are closed.