తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో మృతదేహం మాయం!

తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో రహస్య సంఘటన చోటుచేసుకుంది. ఇస్తాంబుల్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న టీకే79 విమానంలో ఓ ప్రయాణికుడు ప్రయాణం మధ్యలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ ఘటనతో విమాన సిబ్బంది తొలుత ఐస్‌లాండ్‌లోని కెఫ్లావిక్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయాలని నిర్ణయించినప్పటికీ, అది సాధ్యంకాక షికాగో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

అధికారుల సమాచారం ప్రకారం, మృతదేహాన్ని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించారని తుర్కిష్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే, ఆశ్చర్యకరంగా మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం తమకు ఏ మృతదేహం అందలేదని స్పష్టంచేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో విమానం ల్యాండింగ్‌ తర్వాత ఏం జరిగిందనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌ వారికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Read More : చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీ పునఃప్రారంభం