తిరువణ్ణామలైలో ఆస్తి పత్రాల హుండీ కధనంపై వివాదం

తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలో కుటుంబ కలహాలు అపూర్వ సంఘటనకు దారితీశాయి. పదవీవిరమణ పొందిన మాజీ సైనికుడు విజయన్ (65) రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్థానిక రేణుకాంబాల్ ఆలయ హుండీలో వేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

విజయన్, ఆయన భార్య కస్తూరి మధ్య కొంతకాలంగా వ్యక్తిగత వివాదాల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విజయన్ తన ఆస్తుల పత్రాలను ఆలయంలోని హుండీలో వేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే విజయన్ భార్య కస్తూరి, కుమార్తెలు ఆలయాధికారులను కలుసుకుని ఆ పత్రాలను తిరిగి ఇవ్వాలని వేడుకున్నారు.ఈ అంశంపై స్పందించిన ఆలయ అధికారులు, ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ సంఘటన కుటుంబ విభేదాలు ఎంత తీవ్రంగా మారతాయో మరోసారి తేటతెల్లం చేస్తోంది.

Read More : శుభాంశు శుక్లా – భావోద్వేగానికి లోనైన తల్లిదండ్రులు