రాహుల్ గాంధీ: హింసాత్మక ఘటన బాధితులను కలవనున్న రాహుల్ గాంధీ
లోక్సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాను సందర్శించనున్నారు. సోమవారం ఉదయం తన నివాసం 10 జనపథ్ నుంచి మహారాష్ట్రకు బయలుదేరిన రాహుల్ గాంధీ, పర్భానీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో బాధిత కుటుంబాలను కలవనున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయి, అనేక మంది గాయపడ్డారు. రాహుల్ గాంధీ ఈ పర్యటన ద్వారా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలపడానికి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించనున్నారు.
పర్భానీ జిల్లా హింసాత్మక ఘటన
2024 డిసెంబర్ మొదటి వారంలో మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో గ్రామస్థులు, సామాజిక వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసు కస్టడీలో మరణించిన అంబేద్కరైట్ సోమనాథ్ సూర్యవంశీ, నిరసనల్లో పాల్గొని మరణించిన విజయ్ వాకోడే కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.
డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం, నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో రాజ్యాంగం ప్రతిరూపాన్ని ధ్వంసం చేసిన తర్వాత పర్భానీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల అసెంబ్లీలో పేర్కొన్నట్టు సూర్యవంశీ తనను హింసించలేదని మేజిస్ట్రేట్కు చెప్పినట్లు, సీసీటీవీ ఫుటేజీలో క్రూరత్వానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది.
