మహిళా శిశు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు రోజుల మేధో మథన సదస్సు విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడిన మంత్రి, ప్రతి మూడు నెలలకు ఇలాంటి సదస్సులను నిర్వహిస్తామని ప్రకటించారు. జిల్లాల స్థాయిలో కూడా మేధో మథన సదస్సులు నిర్వహిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు.
ఈ సదస్సులో మహిళా శిశు సంక్షేమంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు తమ అమూల్యమైన సూచనలు, అభిప్రాయాలు తెలిపారని మంత్రి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమంపై నిపుణులతో కూడిన సలహా కమిటీని అతి త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేసి స్వీయ రక్షణపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
అంగన్వాడీ టీచర్ల ద్వారా బాలికలకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” గురించి అవగాహన ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళ భద్రత కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి, అంగన్వాడీలతో అనుసంధానం చేస్తామని వివరించారు. త్వరలో ఈ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి, పటిష్టమైన భద్రతా విధానాలు రూపొందించనున్నట్లు చెప్పారు.
పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని, పుట్టిన వెంటనే చెత్తకుప్పలలో, పొదల్లో బిడ్డలను పడేస్తున్న దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్న మంత్రి, ఈ పరిస్థితిని నివారించేందుకు ఊయలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్కడ బిడ్డలను వదిలితే ప్రభుత్వం వారి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్టానికి సంబంధించిన రూల్స్ను రాష్ట్రం అందుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. త్వరలో ఆ రూల్స్ను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. గ్రామ సభల ద్వారా బాల్య వివాహాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ICDS పథకంకి తెలంగాణే పుట్టినిల్లు అని గుర్తుచేసిన సీతక్క, మహబూబ్నగర్లో 1972లో ప్రారంభమైన ఈ పథకం అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. అంగన్వాడీ సేవలను ప్రతి ఇంటికీ చేర్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది వెయ్యి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించిన మంత్రి, జిల్లా కలెక్టర్లతో కలిసి స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్లు, హాజరును పెంచాలని సూచించారు. అంగన్వాడీ గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, వారి సేవలే బాలల భవిష్యత్తును నిర్మిస్తాయని అభిప్రాయపడ్డారు.
“అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమిపై రక్షణ అందని పరిస్థితులు నెలకొంటున్నాయి,” అని వ్యాఖ్యానించిన సీతక్క, బాలికా రక్షక టీంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమ్మాయిలను వేధించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిని సమాజం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అబ్బాయిలకు అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తిస్తే ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Read More : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో యువకుడి మృతి.
